తెలుగులో టపాలు వ్రాసేవారిని చూస్తే ఒక్కొక్కప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఎవరైనా మనవాళ్ళకి జాతీయ పురస్కారాలు వచ్చినప్పుడు, అకస్మాత్తుగా వారిగురించి అందరూ వ్రాసేవారే. అప్పటిదాకా వారు వ్రాసిన పుస్తకాల గురించి అంతగా తెలియకపోయినా, బహుమతి వచ్చేటప్పటికి, ” అలాగా .. తెలియనే తెలియదూ ఇన్నాళ్ళూనూ.. అయితే తప్పకుండా చదవాల్సిందే.. ” అంటూ, ఊరికేఎక్కడైనా దొరుకుతుందేమో అని ఓసారి ” వల” వేసేసి, చివరకి ఎవ్వరూ పంచుకోపోతే, నెట్ అంతా వెదికేసి, అక్కడా దొరక్కపోతే ఇంకో మార్గం లేక కొనేసి చదవడం, ఆ పుస్తకం గురించీ, రచయిత గురించీ పొగిడేయడం. ఇంతమందీ పొగడడం వలన ఆ ప్రఖ్యాత రచయితకి కొత్తగా వచ్చినదేమీ లేదూ, పొగడకపోవడం వలన వారునష్టపోయేదీ లేదు.తన రచన ఎంత గొప్పదో, ఇంకోరెవరిచేతో చెప్పించుకోవలసిన అగత్యం వారికి లేదు.కానీ ఎంత గొప్ప రచయితకైనా జాతీయ గుర్తింపు వచ్చిందంటే, అందులోనూ మన అచ్చతెలుగు రచయిత శ్రీ రావూరి భరద్వాజ గారికి రావడం మనందరికీ గర్వకారణం.
ఈవేళ తెలుగు బ్లాగులు చదువుతూంటే ఒక టపా కనిపించింది.అందులో ” ఒక వ్యక్తి మరణిస్తే తప్ప వాడి గొప్పతనాన్ని తెలుగువాడు అంగీకరించడు..” అని. కానీ మరణించిన తరువాత కూడా గుర్తించడూ అని ఈవేళ్టి టపాలు చూస్తే అనిపించింది.నిన్న శ్రీమతి వి.ఎస్.రమాదేవి గారు అకస్మాత్తుగా బెంగళూరులో గుండె పోటుతో కన్నుమూశారు.ఆవిడేమీ సాదాసీదా వ్యక్తి కారు. గవర్నరుగా,కేంద్ర ఎన్నికల సంఘం తొలి మహిళా ప్రధాన కమిషనర్ గా,రాజ్యసభ సెక్రెటరీ జనరల్ గా, కేంద్ర కాబినెట్ సెక్రెటరీగా కూడా పనిచేసి తెలుగువారి పేరు ప్ర్ఖఖ్యాతులు, దేశమంతా మారుమ్రోగేటట్టు చేసిన వ్యక్తి.
పోనిద్దురూ రాజకీయప్రాభవం ఉంటే ఎవరైనా చేస్తారూ ఇలాటివన్నీనూ అంటారా, పదవీ విరమణ చేసిన తరువాత ఆవిడ చేసిన సాహిత్య సేవ ఎవరు మరిచిపోగలరు? ఆవిడ గురించి ఏ ఒక్కరూ గుర్తుచేసికోలేదంటే మరి అర్ధం అదేగా? ఆవిడ రచించినవి నాకు తెలిసి 8 పుస్తకాలు, ఇదే కాకుండా ఓ వారపత్రికలో కూడా ఒక కాలమ్ నిర్వహించేవారు.మా దగ్గర ఉన్న పుస్తకాలు ఇవీ… అనంతం, చింతన, దారితప్పినమానవుడు, లేడిస్ కంపార్టుమెంట్, మజిలీ, మలుపు, తల్లీబిడ్డ, విపులాచ పృథ్వి
