చూస్తూ..చూస్తూ.. అప్పుడే ఏడాది వెళ్ళిపోయింది, మన తెలుగువారి మొహాల్లో నవ్వు అనేది మాయం అయిపోయి. ఏడాది ముందు కనీసం ఓ ఆశాకిరణమైనా ఉండేది, ఈవారం మన బాపు గారి, కుంచె నుండి ఎలాటి కార్ట్యున్ వస్తుందో అని . ఆయన స్పృశించని కోణం లేదు. తెలుగు ప్రపంచంలో ఏ ఒక్కరంగాన్నీ విడిచిపెట్టలేదు. ఓ సంసారం అనండి, దేవుళ్ళనండి, సినిమాలనండి, జంతుజాలాలనండి. ఋషులూ, మునులూ అనండి, సరే రాజకీయనాయకులే మన అసలు సిసలు జోకర్లు, వాళ్ళగురించైతే గురువుగారికి నల్లేరు మీద నడకే.
తెలుగునాట కార్టూనిస్టులు లేరా అంటే, ఉన్నారు, కొంతమందైతే వారిని మించినవారూ ఉండొచ్చు. కార్టున్ వేయడమే కాదు, దానికి తగ్గ caption వ్రాయడంలో శ్రీ బాపు గారు దిట్ట అనడంలో సందేహం లేదు. ఏది గొప్పా, గీతా, వ్యాఖ్యా అంటే, రెండూ కలిపితేనే కదా అసలు అందం.. .. బాపుగారి గీతని, వ్యాఖ్య లేకుండా ఆస్వాదించడం కష్టం. దానికి ముందుగా, తెలుగు భాష చదవడం రావాలి. కానీ, ఈరోజుల్లో ఎవరిని చూసినా, “ మాట్టాడ్డం వచ్చుకానీ, రాయడం చదవడం రాదండీ..” అంటూ, ఏదో ఘనకార్యం చేసినట్టు, వాళ్ళూ, వారి తల్లితండ్రులూ చెప్పుకోడం. సినిమాల్లోనూ, టీవీల్లోనూ, ఎప్పుడో అప్పుడప్పుడుతప్ప ప్రతీరోజూ వార్తాపత్రికల్లో వచ్చేదీ, మన శాసన సభల్లో, రాజకీయనాయకుల ప్రసంగాలూ, మాత్రమే తెలుగుభాషగా భావించే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము. ఇది మన దురదృష్టం.
శ్రీ బాపూ గారు, ఒక ముద్దుగుమ్మ బొమ్మ వేశారూ అంటే, అది అందానికి నిర్వచనంగా అయిపోయింది. తెలుగునాట అమ్మాయిల వేషధారణకి ఓ “ ప్రామాణికం “ గా ఉండేది, ఒకానొకప్పుడు. ఓ దేవుడి బొమ్మ వేశారూ అంటే, “ ఓహో.. రాముడు ఇలా ఉండేవాడా… శ్రీ కృష్ణుడు ఇలా ఉండేవాడా.. “ అనుకునేటంత గా ఉండేవి. అంతదాకా ఎందుకూ, రావణాసురుడిలోనూ జీవకళ ఉండేది.
ఖండఖండాంతరాల్లో తెలుగు వారికి, ఎప్పుడైనా నిరాశా, నిస్పృహా కలిగితే, సంజీవిని లాటి మందు, శ్రీ బాపూ గారి కార్టూనే అనడంలో సందేహం లేదు. ఒక్కో కార్టున్ చూస్తే, ఒకసారి మందహాసం రావొచ్చు, ఒక్కోటి చూస్తే ఫక్కున నవ్వొచ్చేయొచ్చు. గట్టిగా నవ్వి కడుపునొప్పికూడా రావొచ్చు. “నవ్వునాలుగువిధాల చేటు” అన్న సామెత ని “ ఒట్టుతీసి గట్టుమీదపెట్టు” అన్నంతలా, మార్చేసిన ఘనాపాఠీ శ్రీ బాపూ గారు. బాపూ గారి కార్టూన్ చూస్తే నవ్వడం అనేది, తెలుగువారి హక్కుగా మారిపోయింది. కానీ వీటన్నిటినీ ఆస్వాదించి, మనసారా నవ్వుకోడానికి తెలుగు భాష చదవడం రావాలి. ఏదో తూతూ మంత్రంగా, ఆయన వ్రాసిన కాప్షన్ ని అనువాదం చేస్తే , మజా ఉండదు.
అదృష్టవంతులు శ్రీ బాపూ గారు—తెలుగురాష్ట్రం విడిపోయిన మొదట్లోనే వెళ్ళిపోయారు, లేకపోతే, ప్రస్థుతం ఇరు రాష్ట్రాల మధ్యా జరుగుతూన్న అనవసరపు రాధ్ధాంతాలు చూడలేక “ కుంచె సన్యాసం “ చేసేవారేమో..
శ్రీ బాపూ గారు వేసిన లక్షలాది కార్టూన్లలో కొన్ని….
