మనవాళ్ళకున్న ఓ పెద్ద జాడ్యం ఏమిటంటే, ఏదో ఒక రంగంలో తమ ప్రతిభ ప్రదర్శిస్తే చాలు, వెంటనే ” మా వాడంటే ..మావాడు.. ” అని చంకలెగరేసికోవడం. ఉదాహరణకి నిన్నటిరోజున రియో ఒలింపిక్ క్రీడలలో , కుమారి సింధు బ్యాడ్మింటన్ పోటీలో ఫైనల్స్ కి చేరారు. ఇది చాలా గొప్పవిషయం. అందులో సందేహమేమీ లేదు. ఆమె మన భారతదేశాన్ని represent చేస్తూవెళ్ళిన క్రీడాకారిణి. అందులోనూ ఏదో అరకొరగా పతకాలు తెచ్చే మన క్రీడాకారుల విషయంలో మరీ గొప్ప. అప్పుడెప్పుడో సైనా నెహవాల్ ప్రపంచ ఛాంపియన్ అయినప్పుడు, ఆ వెర్రితల్లి హైదరాబాదులో జన్మదాఖలా లేకపోవడం వల్ల కానీ, లేకపోతే ఆమెనీ ఏ బ్రాండ్ ఎంబాసిడరో చేసేవారు. ఇంకొకావిడ, హైదరాబాదీ అవడంతో హాయిగా బ్రాండ్ ఎంబాసిడరయింది ( పోనిద్దురూ పాకిస్తానీవాడిని పెళ్ళిచేసికుంటే ఏమిటీ? ). భాగ్యనగరంలో ” ఆధార్ కార్డ్ ” ఉందా లేదా? అదీ లెక్క. మరావిడ తెలంగాణా రాష్ట్రం గురించి ఎంత ప్రచారం చేస్తోందో ఆ ” అల్లా ” కే ఎరుక. సయనా నెహవాల్ ప్రపం చ ఛాంపియన్ అయినప్పుడు, తీరిగ్గా కూర్చుని ” అదీ పెద్ద గొప్పేనామ్మా..” అని ఓ తెలివితక్కువ ప్రకటనకూడా చేసింది.Leave it less said the better..
ఇంక ప్రస్తుతానికి వస్తే, నిన్నటి రోజంతా మన టీవీల్లో, సిందూ గురించే కార్యక్రమాలు. ప్రసారమాధ్యమాల్లో కనిపించడానికి , మన రాజకీయనాయకులకి ఇంకో మహదవకాశం. ఏదో తామే ఒలింపిక్ క్రీడల్లో ఆడేసినంత హడావిడి చేస్తున్నారు. ఎవడుపడితే వాడు మా అమ్మాయంటే మా అమ్మాయనేవాడే. అది రైటేనండి బాబూ. .ఓ నెల్రోజులుపోయాక , ఎవరికివారే తమ పార్టీకి చెందిందా, తమకులానికి చెందిందా అనే ప్రక్రియ ప్రారంభించి, మొత్తానికి ఏదో ఒక లేబుల్ తగిలించడం ఖాయం.ఈ అమ్మాయికి మరి మన తెలంగాణా చంద్రుడు గారు, ఏం పదవి ఇస్తారో చూడాలి. పాపం ఆంధ్ర చంద్రుడికి ఛాన్స్ లేదూ అనలేము. ఎందుకంటే ఆమె తల్లితండ్రులది మాచెర్ల ట. ఈమెకి గొడవలేదనుకోండి– పుట్టడమే భాగ్యనగరంలో . ఇందులో గొడవేమిటీ అనకండి… ఎందుకంటే మాచెర్ల పేరుతో , ఆంధ్రప్రదేశ్ లో ఒకటీ, తెలంగాణా లో మూడూ ఉన్నాయి.. ఇప్పుడామ్మాయి ఆంధ్రా అమ్మాయా, తెలంగాణా అమ్మాయా అని తేల్చేది? ఇది నేననేది కాదు, అప్పుడే Facebook లో కొట్టుకోడం మొదలెట్టారు. అందరి వంశవృక్షాలూ , మూలాలూ తెలుస్తాయి. The whole thing looks so funny and silly.. పోనీ ఏ జాతీయక్రీడలో, లేదా ఏ గ్రిగ్గు పోటీలో అయితే ఫలానా రాష్ట్ర ప్రతినిధీ అనొచ్చు. కానీ ఆమె ఇక్కడ అంతర్జాతీయ పోటీల్లో, మన దేశ ప్రతినిధి , అనేమాట, మిగిలినవారి సంగతెలా ఉన్నా, మన తెలుగు వారు మర్చిపోయారు.
అలనాటిరోజుల్లో శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రిగారు ఓ వ్యాసం రాశారు…ఆంధ్రత్వం అని. చదివి ఆనందించండి.
