1992 లో దేశ ఆర్ధిక పరిస్థితి దిగజారిపోవడంతో, మన తెలుగుతేజం శ్రీ నరసింహారావు గారు, కొన్ని ఆర్ధిక సంస్కరణలు ఆవిష్కరించడం తో, ఆర్ధికస్థితి , నియంత్రించబడి పరిస్థితి చక్కబడిందనే చెప్పొచ్చు.. ఆ సంస్కరణలు అమలులోకి తీసుకొచ్చినప్పుడు మాత్రం, నానా గొడవా జరిగింది…
దేశంలో.. ఇంటా బయటాకూడా ‘సంస్కరణ’ ల జోరు ఎక్కువయింది కదూ.. ఒకానొకప్పుడు అంటే 90 వ దశకంలో , ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టి, దేశాన్ని తాకట్టుపెట్టకుండా రక్షించినందుకు, “ స్వదేశీ” గోలతో, ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీవారే, నెత్తీ నోరూ బాదుకున్నారు.. అలాగే పెట్రోల్ ధరలు పెరిగినప్పుడల్లా నానా హడావిడీ చేసి, అల్లర్లు చేసారు… విదేశీ పెట్టుబడులను , ఎక్కువ అనుమతించినప్పుడూ ఇదే గోల చేసారు… అలాటిది, అకస్మాత్తుగా ‘జ్ఞానోదయం ‘ ఎప్పుడయిందో తెలియదు కానీ, అన్నిరంగాల్లోనూ, విదేశీపెట్టుబడులను ఎడాపెడా అనుమతిస్తూ పోతున్నారు.. ఏమిటంటే.. ‘ సంస్కరణలు’ అంటారు.. ఏమో నిజమేనేమో.. కానీ ఒకనాటి ‘కట్టర్ స్వదేశీ” మంత్రం, ‘విదేశీ’ లోకి ఎలా ఎప్పుడు మారిందో మాత్రం అంతుబట్టడంలేదు..
పాతతరం వారికి ఈ ‘ సంస్కరణలు’ జీర్ణం చేసుకోవడమయితే కొద్దిగా కష్టమే..ముఖ్యకారణం వారి దృష్టికోణం.. ఎంతైనా ఓ వయసుదాటినవారందరూ కూడా, నూటికి 70 మంది దాకా, ప్రభుత్వసంస్థలలో పనిచేసినవారే అనడంలో సందేహం లేదు..కారణం ఆరోజుల్లో ప్రెవేటు సంస్థల్లో ఉద్యోగాలకి గారెంటీ ఉండేదికాదు.. ఎప్పుడు పీకేస్తారో, కంపెనీ ఎప్పుడు దివాళా తీస్తుందో తెలిసేదికాదు.. ఓరకంగా చూస్తే, ప్రభుత్వ ఉద్యోగాల్లో అలాటి అఘాయిత్యాలు లేకుండా, సంసారాలు లాగించేసేసారు..బహుశా దేశం మీద అభిమానం కంటే, కడుపులో నీళ్ళు కదలకుండా జీవితం వెళ్ళిపోయేది.. ఓరకమైన complacency అనుకుందాం..ఓ ‘ తరం’ అంతా అలాగ వెళ్ళిపోయినదే.. కాలక్రమేణా, ప్రభుత్వరంగ సంస్థలలో, నాణ్యత తగ్గడం మొదలయింది.. దానిక్కూడా, ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా , ప్రభుత్వ విధానాలే ముఖ్యకారణం..అందరికీ తెలిసినవే…
రోజులన్నీ ఒకలా ఉండవుగా.. రాజకీయపార్టీల విధివిధానాలుకూడా మారాయి.. ఇళ్ళల్లోనే ఓ తరం మారి మరో తరంలోకి అధికారం వెళ్తున్నప్పుడు.. keeping up with times గా మార్పులు చోటుచేసుకుంటాయే.. సందేహం లేదు..గుర్తుందా Bajaj Scooters .. యాజమాన్యం , రాహుల్ బజాజ్ గారినుండి, వారి కొడుకు చేతిలోకి వెళ్ళడమేమిటి, కొద్దిరోజుల్లో.. అప్పటిదాకా ఎన్నో సంవత్సరాలనుండి ఉన్న Bajaj Scooter ఉత్పత్తి ఆపేసారు.. పాతతరం వారైతే , ఏదో తమ కుటుంబసభ్యుడే కనుమరుగైనంతగా బాధపడ్డారు కూడా..కానీ వ్యాపారరీత్యా, స్కూటర్లు తయారుచేయడం మూలానే , నష్టాలు వస్తూన్నట్టు గుర్తించి, కొత్త యాజమాన్యం, స్కూటరు తయారీ ఆపుచేసేసారు.. కొన్ని సంవత్సరాలకి జనాలూ అలవాటుపడిపోయారు..
ఇవన్నీ “బయటి” సంస్కరణలలోకి వస్తాయి… ఇంక “ఇంటి” సంస్కరణల విషయం లోకి వద్దాం..సాధారణంగా మనిషి జీవితం ఓ 70-75 ఏళ్ళనుకుందాం..అందులో15- 20 ఏళ్ళదాకా చదువు, ఆ తరవాత ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు ( ఓ 40 ఏళ్ళనుకుందాం).. సాధారణంగా ప్రతీ గృహస్థూ, అప్పోసప్పో చేసి, తన భార్యా పిల్లలని, కంఫర్టబుల్ గా ఉంచుదామనే చూస్తాడు..ఓ కొత్తవస్తువు కొని ఇంటికి తెచ్చినప్పుడు, తన కుటుంబసభ్యుల మొహంలో కనిపించే ఆనందం, తను చేసిన అప్పు కష్టాన్ని కూడా మరిపింపచేస్తుంది.సందేహం లేదు.. అలాగే పిల్లలని , ఓపికున్నంతవరకూ చదివిస్తాడుకూడా.. ఈ నలభైఏళ్ళ సంసారప్రస్థానంలో ఎన్నో మధురజ్ఞాపకాలు.. వాటన్నిటికీ సాక్ష్యంగా ఇంట్లో ( అదృష్టముంటే అది కూడా స్వంత ఇల్లే) ఎదురుగుండా కనిపించే వస్తువులు చూసి మురిసిపోతూంటాడు పాపం వెర్రి మనిషి.
రోజులన్నీ ఒకేలా ఉండవుగా.. పాత నీరుపోయి కొత్తనీరు వస్తుందే..ఈ కొత్తనీరులో ఉన్న గమ్మత్తేమిటంటే, ఇంట్లో ఉన్న వస్తువులనండి, ఇల్లనండి.. అన్నీ ఇంతకాలం చూసి చూసి మొహం మొత్తేసినట్టనిపిస్తుందిట.. కాలంతో పాటు మనమూ మారాలనే స్లోగన్ ప్రారంభం.రైటే కాదనలేం.. పాత జ్ఞాపకాలని ఎంతకాలం పట్టుకుని వేళ్ళాడతామూ? కానీ తన కళ్ళెదురుగుండానే, తను ‘కడుపుకట్టుకుని’ తన కుటుంబం కోసం కొన్నవస్తువులన్నీ.. బయటకి దారితీయడం.. కొద్దిగా digest చేసుకోవడం కష్టంగానే ఉంటుంది మరి.. ఇదికూడా దేశంలో జరుగుతూన్న “సంస్కరణల” లాటివే…
సంస్కరణల పేరుతో దేశంలో జరుగుతున్న పరిణామాలు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రెవేటీకరణ, ఇన్స్యూరెన్స్ లో ఎక్కువ విదేశీపెట్టుబడులు, మిగిలిన Disinvestment కార్యక్రమాలని జీర్ణించుకోవడానికి టైము పడుతుందనడంలో సందేహం లేదు.. కానీ ఈ ‘ సంస్కరణలు’ అమలు పరుస్తూన్న పాలకుల దృష్టికి కొన్ని కార్యక్రమాలు రానేరావు.. అక్కడకూడా ఖర్చవుతున్నది, మనం కట్టే పన్నులే కదా.. కానీ ఆ ‘ రాయితీలు’ ఆపితే, వీళ్ళు మళ్ళీ ఎన్నికయే అవకాశాలుండవు. చేసేదేదో ధైర్యం ఉంటే, అన్నీ అమలు చేయాలి.. అంతేనేకానీ selective implementation కాదు…